వాతలు పెట్టకుండానే ‘వాలంటరీ’ ఇచ్చేస్తారా?

వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి, ఓ సందర్భంలో జగన్ కాళ్ళ దగ్గర కూడా కూర్చుని, జగన్ ప్రభుత్వం చేసిన అవినీతికి అన్నివిధాలా సహకరించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ పెట్టుకున్న వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రవీణ్ ప్రకాష్ గత నెల 25న వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో డిజిటల్ సంతకం వుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. దాంతో ప్రవీణ్ ప్రకాష్ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్‌కి ఆమోదం తెలపదని, ఆయన చేసిన తప్పులకు శిక్ష విధించే దిశగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్న తరుణంలో, ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వీఆర్ఎస్‌కి ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, కూటమి అధికారంలోకి వస్తే తన ఉద్యోగం వుండదని వ్యాఖ్యానాలు చేసేవారు. తనకు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం వుంటే సూచించాలని తన సహచరుడికి వాట్సాప్ సందేశం కూడా పంపించారు. ప్రవీణ్ ప్రకాష్ చేసిన తప్పులన్నీ చేసి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశ్చాత్తాప పడుతూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. తన ప్రవర్తన ఎవరికైనా బాధ కలిగించి వుంటే క్షమించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. వైసీపీ రాక్షస పాలన జరిగిన ఐదేళ్ళలో ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కొన్ని విషయాలను ప్రస్తావించుకుంటే....

* మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఏటీఎంగా పనిచేశారని, ఎన్నో అవకతవకాలకు సహకారం అందించారనే ఆరోపణలు వున్నాయి.

* ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపులో మంత్రి బొత్స చెప్పినట్టే చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 150 కోట్ల విలువ చేసే చిక్కీల టెండర్లను మూడేళ్ళపాటు పొడిగింారు.

*  2024-25 విద్యాకానుక కొనుగోళ్ళలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆర్థిక శాఖ అనుమతి లేకపోయినా, అప్పటి సీఎంఓ ఆమోదం తెలుపకపోయినా 772 కోట్ల రూపాయలతో కొనుగోళ్ళు చేయడానికి పాత కాంట్రాకర్లకే ఆర్డర్లు ఇచ్చేశారు.

* జగన్ సీఎంగా వున్నప్పుడు ఆయన పేషీలో వుండే ప్రవీణ్ ప్రకాష్ ఎవరినీ లెక్కచేసేవారు కాదు. చివరికి చీఫ్ సెక్రటరీని కూడా లెక్క చేయకుండా ప్రవర్తించారు.

* కొంతమంది అధికారుల మీద తెలుగుదేశం ముద్ర వేసి ఇబ్బందిపెట్టారు. 

* విశాఖ కలెక్టర్‌గా పనిచేసే సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు పట్టించుకోకపోవడం వల్ల ఈసీ ఆగ్రహానికి గురయ్యారు.

* పాఠశాల విద్యా శాఖలో కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుగా హడావిడి తనిఖీలు చేశారు. ఉపాధ్యాయులను బెదిరించారు.

ఇవి శాంపిలే.. ప్రవీణ్ ప్రకాష్ మీద వైసీపీ అవినీతికి సహకరించారన్న ఎన్నో ఆరోపణలు వున్నాయి. అలాంటి ఆయనకు తగిన శాస్తి చేయకుండా, వీఆర్ఎస్ ఇవ్వడం పట్ల పలువురు నిరాశకు గురవుతున్నారు. 

Teluguone gnews banner